వివాహ చిహ్నములు-ప్రాముఖ్యత
వివాహ
చిహ్నములు-ప్రాముఖ్యత
శరీరము మనుగడకు ఆత్మ
ఎంత అవసరమో, ఆత్మ మనుగడకు శరీరము అంతే అవసరము. ఈ విశ్వం లోని చరాచర సృష్టి అంతా స్త్రీ పురుష ప్రకృతులుగా రూపు దాల్చి జీవిస్తోంది.
విడివిడిగా జన్మించి కలిసి మనుగడ సాగిస్తోంది. ఎక్కడో మహా యోగులైన పురుషులను
మినహాయిస్తే స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకరు లేకుండా ఇంకొకరు పరిపూర్ణ వంతులు
కాలేరు. అందుకే ఆ ఇద్దరినీ కలిపి సంపూర్ణవంతులు అవ్వడం కోసం వారి బంధాన్ని పరిపూర్ణ
బంధంగా మార్చే ధర్మకార్యం “వివాహము”. ఈ
వివాహము అనే కార్యము ఇద్దరు వ్యక్తులనే కాకుండా రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది.
స్త్రీ పురుషుల ఇద్దరి జీవితాలలోనూ
భౌతికముగా, అంతర్ముఖంగా అనేక మార్పులను తీసుకు వస్తుంది.
బయట నుంచి చూస్తే వివాహం, వైవాహిక బంధం పురుషునిలో కన్నా
స్త్రీలోనే ఎక్కువ మార్పులను తీసుకొస్తుంది. వస్త్రధారణ,అలంకరణలో అనేక ప్రత్యేకమైన
మార్పులకు లోనౌతుంది.అనేక పరిధులు,పరిమితులు ఏర్పడతాయి. ఇదంతా స్త్రీలకు మాత్రమే
మారుతుంది. వివాహమైన పురుషునిలో సాధారణంగా ఎటువంటి మార్పు కంటికి కనబడదు. కానీ
వివాహమైన స్త్రీకి మాత్రం అనేక ఆభరణాలు వైవాహిక చిహ్నాలుగా చేరి ఆమె వివాహవతి అన్న
విషయాన్ని ప్రపంచానికి తెలియచేస్తాయి.ఇక్కడ
ప్రపంచానికి తెలియ జేస్తాయి అంటే పురుష ప్రపంచానికి తెలియజేస్తాయి అనే..
వీటన్నిటివలనా ఆ స్త్రీ సుమంగళి అనీ, సౌభాగ్యవతి అనీ , పరస్త్రీ అని వ్యవహరించబడుతుంది.
ప్రకృతిలో స్త్రీ
పురుషులు ఇద్దరూ సమానులు అయినప్పుడు ఈ వివాహ చిహ్నాలను స్త్రీలు మాత్రమే ధరించడం
లోని అంతరార్ధం స్త్రీ స్వేచ్చను హరించడం కాదా? స్త్రీని తొక్కివేయడం కాదా? ఇది అతి
సున్నితమైన, అతి ముఖ్యమైన, అత్యంత ఆసక్తికరమైన విషయం. వివాహ చిహ్నాలను ధరించడం
ఒక్క హైందవ మతంలోనే కాదు, ప్రపంచంలో ఏ వివాహ పద్ధతి చూసినా స్త్రీలు మాత్రమే ఈ
చిహ్నాలను ధరించడం చూడవచ్చు.
మతాచారాలలో
స్త్రీలకు పుట్టుకతోనే నుదుటన కుంకుమ ధరించడం, గాజులు ధరించడం మొదలౌతుంది. కానీ
కొన్ని మతాలలో వివాహ సందర్భంలో భర్త భార్య నుదుటన, పాపిటలో పెట్టిన కుంకుమే ఆమె
వివాహ బంధంలో ఉన్నది అన్న విషయాన్ని తెలుపుతుంది.
స్త్రీ వివాహిత అని
తెలుపు చిహ్నాలలో ముఖ్యమైనవి తాళిబొట్టు(మాంగల్యము), పసుపు కుంకుమలు, గాజులు, మెట్టెలు(మట్టెలు),
ముక్కుపుడక(అడ్డు బాస), కళ్యాణం ఉంగరం మొదలయినవి.
స్త్రీకి వివాహమయిన
తరువాత తప్పనిసరిగా ధరించే చిహ్నాలలో మొదటిది తాళిబొట్టు.దీనికే మంగళ సూత్రము,
పుస్తెల తాడు అని నామాంతరాలు ఉన్నాయి. స్త్రీ కి వివాహ సమయములో రెండు
మంగళసూత్రాలను (అత్తింటి వారిది ఒకటి, పుట్టింటి వారిది ఒకటి) గౌరీదేవి వద్ద పూజ
చేయించి, పురుషుని చేత స్త్రీ మెడలో కట్టిస్తారు. పుట్టినింటికీ, మెట్టినింటికీ
మధ్య వారధిలా నిలిచి, రెండు కుటుంబాల పేరు ప్రతిష్టలనీ,సంస్కృతీ సంప్రదాయాలనీ
నిలబెట్టడానికి కృషి చేయమని సూచించడం మాంగల్య ధారణలో గల అంతరార్ధం.
ఈ రెండు సూత్రాలను
ఎంత బీదవారయినా తప్పనిసరిగా బంగారముతోనే చేయిస్తారు. ఎందుకనగా బంగారము
కుజగ్రహానికి చెప్పబడిన లోహము. కుజుడు అగ్ని. ఉష్ణాన్ని నియంత్రించడంలో బంగారము
సాయపడుతుంది. శరీరము నందు ఉత్పన్నమయ్యే ఉష్ణ శక్తికి నియంత్రించి శరీరాన్ని
ఆధీనములోకి తెచ్చే శక్తి బంగారానికి కలదు. అలాగే ఇది గర్భోత్పత్తికి సహాయకారిగా
ఉండి, వంధ్యత్వమును పోగొట్టడంలో సహాయపడుతుంది. అందుకనే స్త్రీల ఒంటి మీద మాత్రమే
ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. “ అమృతం వైహిరణ్యం”, “ఆయుష్యం వర్చస్యగ్”
అనే వివాహ మంత్రంలోనూ ఆయుష్షు పెంచుతుందని చెప్తూ దీన్ని ధరింపజేస్తారు.
కుంకుమ
స్త్రీలు మాత్రమే తప్పనిసరిగా కుంకుమ ధరించాలని ఉన్న నియమము ఈ నాటిది కాదు.హైందవ మతములో ప్రాచీనకాలము నుండి సంప్రదాయముగా వస్తున్నది. వివాహము అయిన స్త్రీలకూ కుంకుమ అతి ముఖ్యమయిన ఆభరణం.
ప్రతి స్త్రీ దీనిని తప్పని సరిగా ధరిస్తుంది.కొన్ని కుటుంబాలలో కుంకుమ మాత్రమే ఆ
స్త్రీ వివాహవతి అని చెప్పడానికి గుర్తు.
వివాహానికి ముందు నుదుటన మాత్రమే ధరించే స్త్రీలు, వివాహము తరువాత పాపిటన కూడా ధరిస్తారు.కుంకుమ బొట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖాన గనుక సింధూరం
ఉంటేదృష్టి సోకదని, చెప్తారు.
నుదుట తిలకం లేకపోతే ముఖం కళ తప్పి బోసిగా ఉండటమే కాదు, మంచిది కాదని పండితులు ఉద్బోధించారు. కనుక కుంకుమ కేవలం సౌందర్య చిహ్నం కాదని, మానవుల దృష్టి సోకకుండా ఉంటుందని అంటారు.
కుంకుమ లేదా తిలకం ఎర్రగా ఉంటుంది. ఎరుపు సూర్యునికి సంకేతం. నుదుట ధరించే సింధూరం సూర్యుని వేడిమి తాకకుండా చేస్తుంది. ఇంకా, శరీరంలోని అన్ని నాడులనూ కలుపుతూ, మెదడుకు సంకేతస్థానమై, ఎప్పుడూ చైతన్యంగా ఉండే అతి కీలకమైన “సుషుమ్న” నాడి ఉండేది లలాటం మీదనే. దాన్నే “జ్ఞాననేత్రం” అంటారు. ఈ జ్ఞాననేత్రానికి ఇతరుల దృష్టి సోకకుండా, సూర్యతాపం దానిమీద పడకుండా చేసేందుకు సిందూరం పెట్టుకునే ఆచారం జనించింది. అంటే రక్త ప్రసరణ వల్ల, ఆలోచనల వెల్లువ వల్ల కలిగే వేడి జ్ఞాననేత్రానికి తగలకుండా అది సురక్షితంగా ఉండేందుకు గానూ ఎప్పుడూ కుంకుమ ధరించి ఉండాలి అన్నారు.
ఉంగరం ప్రత్యేకత:
కొన్ని మతాలలో వివాహ
చిహ్నముగా ఉంగరమును ధరించడం ఆచారముగా ఉన్నది. ఈ ఉంగరమును స్త్రీలు వారి ఎడమచేతి చిటికెనవేలు పక్కనున్న నాలుగవవేలుకు
పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ వేలు నుండి ఒక రక్త నాళము తిన్నగా హృదయానికి పోవును.
అందుకే ఈ వేలుని “ఉంగరము వేలు” , “అనామిక” అని కూడా వ్యవహరిస్తారు. దీనిని ధరించడం
వలన ఇక్కడ చర్మానికి స్పర్శ కలిగి హృదయం మన ఆధీనములో నియంత్రణ కలిగి ఉంటుంది.
అందువలన ఉంగరమును ఆ వేలుకు మాత్రమే ధరింపజేయడం ఆచారముగా కొనసాగుతున్నది.
ముక్కుపుడక ప్రత్యేకత:
కొన్ని మతాలలో
ముక్కుపుడకని వివాహ సందర్భంలో స్త్రీకి ధరింపజేయడం అనే ఆచారము ఉన్నది.
ముక్కుపుడకకి అడ్డు బాస,ముక్కెర, అని నామాంతరాలు ఉన్నాయి. భాషని అడ్డగించడానికి
దోహదపడేది కనుక దీనికి “అడ్డు బాస” అనే పేరు వచ్చింది. మాట్లాడేటపుడు ముక్కుకు
రాపిడి జరిగి అడ్డంగా ఉండి మితంగా మాట్లాడమని హెచ్చరిస్తూ ఉంటుంది. స్త్రీలకి
వివాహం తర్వాత ఇంటి బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతలలో వచ్చే దోషాలను పోగొట్టడానికి
కూడా ఇది సహాయకారిగా వ్యవహరిస్తుంది. ఇది కూడా బంగారపులోహంతో తయారయినటువంటిదే.అలంకారంగా స్థిరపడిన ముక్కెరను కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న
సాంప్రదాయం.
తాళిబొట్టు మాదిరిగానే
వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం కొందరు తీయరు. అది ఉన్నంతకాలం భర్త
క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా
కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో
కూడా పెద్ద ముత్యపు ముక్కెరను( నాత్) మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది
దాదాపు గడ్డం వరకు వస్తుంది. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు
వాడతారు.
కాలిమట్టెలు-ప్రత్యేకత:
స్త్రీకి వివాహము
అయిన తరువాత ధరించే వాటిలో అతి ముఖ్యమయినవిగా కాలి మట్టెల గురించి చెప్పుకోవచ్చు. గర్భకోశములో
ఉన్న నరాలకు కాలి వేళ్ళకు సంబంధము ఉన్నది. స్త్రీత్వము నకు భంగము కలుగ కుండా
ఉండాలంటే స్త్రీలు కాలికి మట్టెలు పెట్టుకోవాలని పురాణాలు చెపుతున్నాయి.
స్త్రీలు
పురుషులకన్నా అధికులు అని చెప్పినట్టి పద్యం.
స్త్రీణాం
ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం
చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
భావం:
పురుషులకంటే స్త్రీలకు ఆహారం రెండు
రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు, సాహసం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా
ఉంటుంది అని అర్ధం.
కామ,క్రోధములను
నియంత్రించడానికి వీటిని ధరించడం అవసరము అని శాస్త్రాలు చెపుతున్నాయి. వీటిని
ధరించడం వలన కాలివేళ్ళ మధ్య ఒరిపిడి జరిగి కోరికలను నియంత్రించడానికి
సహాయపడుతుంది. సన్యాసులు పావుకోళ్ళను ధరించడంలో పరమార్ధం కూడా కోరికల నియంత్రణ
కోసమే. కోరికలను అదుపులో ఉంచే నరము కాలి బొటనవేలుకు పక్కనున్న రెండవ వేలుకు సంబంధించి
ఉంటుంది. ఈ రెండు వేళ్ళకు ఒత్తిడి కల్గడం కోసం సన్యాసులు పావుకోళ్ళను వేసుకుంటారు.
స్త్రీలకు పూర్తిగా కోరికలను నాశనము చెయ్యడం ప్రకృతి విరుద్ధం కనుక ,పురుషులతో
సమానంగా ఉండటం కోసం బొటన వేలు పక్కనున్న వేలుకు వెండి తో చేసిన మట్టెలను
ధరింపజేస్తారు. ఇది కూడా దేహములో ఉష్ణాన్ని తగ్గించడంలో సహాయపడ్తుంది. వీటిని
వివాహ సమయములో కొందరు అత్తగారి చేత పెట్టిస్తే, కొందరు భర్త చేత పెట్టిస్తారు.
అలాగే ఈ చిహ్నాల
గొప్పదనము ధరించిన వారికీ, ధరించని వారికీ మధ్య గల వ్యత్యాసాలు పరిశీలించినపుడు
వాటి ఆవశ్యకత తెలుస్తుంది. ఇవి అలంకారాలు మాత్రమే కాక స్త్రీలలో వచ్చే
కీళ్ళనొప్పులు,కాళ్ళనొప్పులు,ఒత్తిడులను తగ్గించడంలో, ఉష్ణాన్ని నియంత్రించడంలో
సహాయకారిగా పనిచేస్తాయి.
అలాగే ఈ వివాహ చిహ్నాలను ధరించడం అనేది ఈనాడు వచ్చిన
సంప్రదాయం కాదు, ప్రాచీన కాలము నాటిది. ఈ ఆచారాలు ధర్మ బద్ధమయినవి, మానవులకు మేలు
చేసేవి కనుకనే కొన్ని వేలయేళ్ళ నాటి సంప్రదాయాలు నేటికీ ఆచరణలో ఉన్నాయి. అనేక
సరిక్రొత్త రూపాలను పొంది స్త్రీల మనస్సులను దోచుకుంటున్నాయి.
గాజుల ప్రత్యేకత:
రంగు రంగుల గాజులు మనకు
అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. చేతినిండా బంగారు గాజులు
ధరించి, వాటిని ఆస్తిగా పరిగణిస్తాం. పూర్వపు రోజుల్లో భార్య చేతికి ఎన్ని
బంగారు గాజులు ఉంటే అంత సంపాదనా పరుడిగా భర్తని లెక్కకట్టేవారట. అయితే
గాజులు ధరించడం అనే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా? గర్భాశయ నాడులను
ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి
మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు
స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా
ఉత్తేజితమవుతుంటాయి. దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా
జరుగుతుంటాయి.ఇందుకు తప్పనిసరిగా గాజులనే ధరించాలా? ప్రత్యామ్నాయం లేదా
అంటే... ఉంది. రోజూ కొంతసేపు మణికట్టు-ముంజేతి మధ్య చేత్తో నొక్కుకోవచ్చు.
అలాగని మర్దన చేసినంత ఒత్తిడి పడకూడదు.
No comments:
Post a Comment